ఎల్జీబీటీ పార్ట్-2కు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం –

ఎల్జీబీటీ పార్ట్-2కు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం – మంత్రి అడ్లూరి లక్ష్మణ్
సామాజిక అంశాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘ఎల్జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్’ చిత్రం విజయవంతంగా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఘనంగా విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ… ఈ సమాజంలో ట్రాన్స్జెండర్స్కు కూడా గౌరవప్రదమైన జీవితం ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన అని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రాన్స్జెండర్స్కు ప్రాధాన్యం కల్పిస్తోందని తెలిపారు. సమాజంలో అందరితో సమాన హక్కులు, అవకాశాలతో వారు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తోందని కొనియాడుతూ, ‘ఎల్జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్ పార్ట్-2’ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ప్రేక్షకులు తమ చిత్రాన్ని విశేషంగా ఆదరించి 50 రోజుల విజయాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం ద్వారా ప్రతి మనిషిని గౌరవించే భావన సమాజంలో పెరగాలని తాము కోరుకున్నామని, ప్రేక్షకులు ఆ సందేశాన్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ… ఈ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమైందని, ఇందులో నటించడం గర్వంగా ఉందన్నారు. 50 రోజుల విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని, ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.
చిత్రంలో తండ్రి పాత్రలో నటించిన ఆనంద్ చక్రపాణి మాట్లాడుతూ… ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉందని, 50 రోజుల విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
నటి హిమ మాట్లాడుతూ… తన సినీ జీవితంలో ఈ 50 రోజుల వేడుక ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకమని, ప్రేక్షకులకు మరియు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డిని అభినందిస్తూ, ఆయన నుంచి మరిన్ని మంచి సందేశాత్మక చిత్రాలు రావాలని ఆకాంక్షించారు.
గ్రేడియంట్ ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్ కంపెనీ అధినేత చిత్ర సమర్పకుడిగా విమల్ రాజ్ మాథుర్ ఈ చిత్రాన్ని హిందీ లోకి అనువాద కార్యక్రమాలు ప్రారంభించామని త్వరలో చిత్రం ద్వితీయ భాగాన్ని తమ బ్యానర్ పై సమర్పిస్తున్నామని తెలియచేసారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదాల రవి ఈ చిత్రంలో నటించిన ట్రాన్స్జెండర్ కళాకారులకు మరిన్ని చిత్రాలలో అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖకు చెందిన దాసు ట్రాన్సజెండర్ వ్యక్తులు పట్ల ఈ చిత్రం చాలా అవగాహన పెంచిందని తెలిపారు. క్వీర్ బందు వ్యవస్థాపకురాలు ముకుంద మాల ఏ చిత్రానికి సహాయం అందించిన విద్యాసంస్థలకి , వివిధ స్వచంద సంస్థలకి ధన్యవాదాలు తెలిపారు. సందీప్ జైన్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఒక చిత్రం ఈ తరహాలో నిర్మించడానికి టీమ్ కి తమ సహకారం అందిస్తానని తెలిపారు.
చిత్రం లో నటించిన సోనా రాథోడ్, విష్ణు తేజ రమణ, టీ వీ రామన్, వంశీ , సాంకేతిక నిపుణులు ప్రతాప్ రెడ్డి, నాగరాజు, తేజ , సాయి ప్రసాద్, కోటి, డిస్ట్రిబ్యూటర్ బి బాపిరాజు పాల్గొన్నారు అజయ్ అగర్వాల్, దర్శకులు వీ యెన్ ఆదిత్య , చిన్ని కృష్ణ , షేక్ ఆమన్ తదితరులు చిత్ర బృందాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
చివరగా చిత్ర బృందం 50 రోజుల విజయానికి కారణమైన ప్రేక్షకులకు, మీడియాకు మరియు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
